పద్యం - 20 (దేహ అనిత్యత మరియు మరణ నిశ్చయత)
సీ.
పాంచభౌతికము దుర్బలమైన కాయం బి
దెప్పుడో విడుచుట యెఱుకలేదు
శతవర్షములదాఁక మితముఁ జెప్పిరి గాని
నమ్మరాదా మాట నెమ్మనమున
బాల్యమందో మంచిప్రాయమందో లేక
ముదిమియందో లేక ముసలియందో
యూరనో యడవినో యుదకమధ్యముననో
యెప్పుడో విడుచుట యే క్షణంబొ
తే.
మరణమే నిశ్చయము బుద్ధిమంతుఁడైన
దేహమున్నంతలో మిమ్ముఁదెలియవలయు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర!
ప్రతి పదార్థం
పాంచభౌతికము = పంచభూతాలతో (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం) చేయబడినది
దుర్బలమైన = చాలా బలహీనమైనది అయిన
ఈ + కాయంబు = ఈ శరీరం
ఇది + ఎప్పుడో = ఇది ఎప్పుడో
విడుచుట = (ప్రాణం దీనిని) విడిచిపెట్టడం
ఎఱుకలేదు = తెలియదు
శతవర్షముల + దాఁక = వంద సంవత్సరాల వరకు
మితమున్ + చెప్పిరి + కాని = ఆయుర్దాయాన్ని చెప్పారు కానీ
నెమ్మనమున = మనస్సులో
ఆ + మాట నమ్మరాదు = ఆ మాటను నమ్మకూడదు
బాల్యమందో = బాల్యంలోనో
మంచిప్రాయమందో + లేక = మంచి యవ్వనంలోనో లేక
ముదిమియందో + లేక = వృద్ధాప్యంలోనో లేక
ముసలియందో = ముసలితనంలోనో
ఊరనో = ఊరిలోనో
అడవిలో = అడవిలోనో
ఉదకమధ్యముననో = నీటి మధ్యలోనో
ఎప్పుడో విడుచుట = ఎప్పుడు విడిచిపెడుతుందో
ఏ క్షణంబొ = ఏ క్షణంలోనో (తెలియదు)
మరణమే నిశ్చయము = మరణం అనేది తథ్యం
బుద్ధిమంతుఁడు + ఐన = తెలివైనవాడైతే
దేహము + ఉన్నంతలోన్ = ఈ దేహం ఉన్నంత కాలంలోనే
మిమ్మున్ + తెలియవలయు = మిమ్మల్ని (మీ తత్వాన్ని) తెలుసుకోవాలి
(మకుటం) = (మొదటి పద్యంలోని మకుటమే పునరావృతం)
తాత్పర్యం
ఓ నరసింహ స్వామీ! పంచభూతాలతో నిర్మితమైన ఈ బలహీనమైన శరీరాన్ని ప్రాణం ఎప్పుడు విడిచిపెడుతుందో తెలియదు. శాస్త్రాలు వందేళ్ళ ఆయుష్షు అని చెప్పినా, ఆ మాటను పూర్తిగా నమ్మలేము. బాల్యంలోనో, యవ్వనంలోనో, వృద్ధాప్యంలోనో - ఏ దశలోనైనా; ఊరిలోనో, అడవిలోనో, నీటిలోనో - ఏ ప్రదేశంలోనైనా; ఏ క్షణంలోనైనా మరణం సంభవించవచ్చు. మరణం తథ్యం కాబట్టి, బుద్ధిమంతుడైన వాడు ఈ దేహం ఉన్నంత కాలంలోనే నీ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
విశ్లేషణ
ఈ పద్యం మానవ జీవితంలోని అత్యంత కఠినమైన, కానీ పరమ సత్యమైన "మరణం" అనే అంశాన్ని ముఖాముఖిగా పరిచయం చేస్తుంది. ఇది భయం కలిగించడానికి కాకుండా, జాగృతం చేయడానికి ఉద్దేశించిన ఒక హెచ్చరిక.
1. తీవ్ర వైరాగ్య బోధ:
దేహ అనిత్యత: దేహాన్ని "పాంచభౌతికము", "దుర్బలమైనది" అని వర్ణించడం ద్వారా, మనం ఎంతో అపురూపంగా చూసుకునే శరీరం యొక్క అశాశ్వత స్వభావాన్ని కవి నొక్కి చెబుతున్నాడు. ఇది దేహంపై ఉండే మమకారాన్ని, "దేహమే నేను" అనే భ్రమను (దేహాత్మ బుద్ధిని) తొలగించడానికి సహాయపడుతుంది.
పాంచభౌతిక నిర్మాణం మరియు విలయం: వేదాంతం ప్రకారం, ఈ శరీరం పంచభూతాల సమ్మేళనం. పృథివి (భూమి) తత్వం వల్ల ఎముకలు, మాంసం వంటి ఘనపదార్థాలు; జల (నీటి) తత్వం వల్ల రక్తం, లాలాజలం వంటి ద్రవపదార్థాలు; అగ్ని తత్వం వల్ల శరీరంలోని ఉష్ణం, జీర్ణశక్తి; వాయు తత్వం వల్ల శ్వాస, కదలిక; ఆకాశ తత్వం వల్ల శరీరంలోని ఖాళీ ప్రదేశాలు ఏర్పడతాయి. మరణానంతరం, ఈ శరీరం తిరిగి పంచభూతాలలోనే కలిసిపోతుంది. దహనం చేస్తే అగ్నిలో, భూస్థాపితం చేస్తే భూమిలో కలిసి, నీరు నీటిలో, గాలి గాలిలో, ఆకాశం ఆకాశంలో విలీనమవుతాయి. కాబట్టి, అప్పు తెచ్చుకున్న ఈ శరీరంపై మమకారం పెంచుకోవడం అవివేకం.
మరణం యొక్క అనిశ్చితి: మరణం తథ్యం ("మరణమే నిశ్చయము"), కానీ అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తుందో అనిశ్చితం. ఈ అనిశ్చితిని కవి బాల్యం-ముసలితనం, ఊరు-అడవి అంటూ ఎన్నో ఉదాహరణలతో మన కళ్ళ ముందు ఉంచుతాడు. ఈ వాస్తవాన్ని గ్రహించినప్పుడు, లౌకిక విషయాలపై ఉండే తీవ్రమైన ఆసక్తి తగ్గి, శాశ్వతమైన దాని కోసం అన్వేషణ ప్రారంభమవుతుంది.
"ముదిమి" - "ముసలి" - పద ప్రయోగ విశేషం: కవి ఈ పద్యంలో వృద్ధాప్యాన్ని సూచించడానికి "ముదిమి", "ముసలి" అని రెండు పదాలను వాడటం గమనార్హం. ఈ రెండింటి మధ్య సూక్ష్మమైన భేదం ఉంది.
ముదిమి: ఇది వృద్ధాప్యం అనే 'దశ'ను (Stage of life) సూచిస్తుంది. యవ్వనం తర్వాత వచ్చే జీవిత దశ.
ముసలి: ఇది వృద్ధాప్యం యొక్క 'స్థితి'ని (State of being), ముఖ్యంగా శారీరక బలహీనతను, జీర్ణించిపోయిన రూపాన్ని సూచిస్తుంది.
కవి ఈ రెండు పదాలను వాడటం ద్వారా, మరణం వృద్ధాప్యంలో ఏ సమయంలోనైనా రావచ్చని నొక్కి చెబుతున్నాడు. వృద్ధాప్యం ప్రారంభమైన 'ముదిమి' దశలోనైనా రావచ్చు, లేదా శరీరం పూర్తిగా శిథిలమైన 'ముసలి' స్థితిలోనైనా రావచ్చు. ఈ ప్రయోగం మరణం యొక్క అనిశ్చితిని మరింత బలంగా చెప్పడానికే.
2. వేదాంత విశేషాలు:
తత్త్వ విచారణకు ప్రేరణ: శరీరం పంచభూతాలతో నిర్మితమైనది. మరణానంతరం, ఈ భూతాలు తిరిగి వాటి మూలంలోకే కలిసిపోతాయి. కానీ, ఈ దేహాన్ని నడిపించే చైతన్యం (ఆత్మ) ఏమవుతుంది? ఆ ఆత్మకు, పరమాత్మకు ఉన్న సంబంధం ఏమిటి? "మిమ్ముఁదెలియవలయు" అనే వాక్యం ఈ ఆత్మవిచారణ చేయమని, తన నిజ స్వరూపాన్ని, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోమని జీవుడిని ప్రోత్సహిస్తుంది. ఆదిశంకరుల "భజ గోవిందం"లోని "పునరపి జననం పునరపి మరణం" వంటి శ్లోకాలలో ఉన్న సారాంశమే ఈ పద్యంలో కనిపిస్తుంది.
3. ఆచరణాత్మక / లౌకిక విశేషాలు:
వాయిదా వెయ్యవద్దు (No Procrastination): "దేహమున్నంతలో మిమ్ముఁదెలియవలయు" అనేది ఆధ్యాత్మిక సాధనకు సంబంధించిన ఒక అత్యవసరమైన పిలుపు. "ముసలితనంలో చూసుకోవచ్చులే" అని ఆధ్యాత్మిక సాధనను వాయిదా వేయడం అవివేకమని కవి హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఆ ముసలితనం వరకు జీవిస్తామన్న గ్యారెంటీ లేదు.
బుద్ధిమంతుని లక్షణం: కవి ప్రకారం, లోకంలో నిజమైన బుద్ధిమంతుడు ఎవడంటే, మరణం యొక్క నిశ్చయతను గ్రహించి, తనకు లభించిన సమయాన్ని వృథా చేయకుండా, జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడే. ధనం, కీర్తి సంపాదించినవాడు కాదు.
4. యోగ విశేషాలు:
సాధన యొక్క ఆవశ్యకత: యోగ మార్గంలో లక్ష్యాన్ని (సమాధి లేదా మోక్షం) చేరడానికి నిరంతర సాధన అవసరం. ఈ శరీరం అనే సాధనం ఎప్పుడు చేజారిపోతుందో తెలియదు కాబట్టి, అది చేతిలో ఉన్నప్పుడే సాధనను తీవ్రతరం చేయాలి. ఈ పద్యం యోగసాధకునికి తన లక్ష్యం పట్ల మరింత నిబద్ధతతో, పట్టుదలతో ఉండటానికి ప్రేరణ ఇస్తుంది. అనిత్యమైన దేహం ద్వారా నిత్యమైన ఆత్మను తెలుసుకోవడమే యోగం యొక్క లక్ష్యం.